స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Tuesday 26 August 2014

చాకిరేవు-08

"ఏట్రా అబ్బాయ్ టి.వి. చూస్తన్నావా, ఇయ్యాల కాలేజీ సెలవా?" అడిగాడు బాబాయ్ బయటనుంచి వస్తూ...
"లేదు బాబాయ్, కాస్త ఒంట్లో నలతగా ఉన్నాది. అందుకే కాలేజీకి వెళ్లలేదు." అన్నాడు అబ్బాయ్.
"అయ్యో,అదేట్రా... నువ్వు మాంచి ప్లేయరువి, నీకు జొరమేటెహె... మరి డాక్టరు కాడికి ఎల్లకపోయావా?" అన్నాడు బాబాయ్.
"లేదులే బాబాయ్, ఇప్పుడే టేబ్లెట్ వేసుకున్నాను. పిన్ని మిరియాల కషాయం ఇచ్చింది. సాయంత్రం కల్లా తగ్గిపోతుందిలే. అప్పటికి తగ్గకపోతే అప్పుడు వెళతాను." అన్నాడు అబ్బాయ్.
"సరే... సరే... మరి రెష్టు తీసుకోకుండా టీ.వీ.కాడ కూకున్నావెందుకురా" అన్నాడు బాబాయ్.
"బోర్ కొడుతోంది బాబాయ్... అందుకే టీ.వీ. చూస్తున్నాను. ఈ ప్రోగ్రాములు చూస్తుంటే మరింత బోరు కొడుతోంది." అన్నాడు అబ్బాయ్.
"అదేట్రా, ఐదేల్ల గుంటడి కాడ్నించి... అరవయ్యేల్ల ముసిలోడు వరకు టీ.వీ.కాడ రోజు మొత్తం కూకొనే ఉంటన్నారు. ఆడోల్లకి సీరియల్ కతలు, సిన్న గుంటలకి కార్టూన్ బొమ్మలు, నీలాటి కుర్రోల్లకి ఆటలు, పాటలు, సినీమాలు, కిరికెట్టు మాచీలు, నాలాటి ముసిలోల్లకి వార్తలు... ఇలాగ సుమారు వంద సానల్లలో ఆల్లు ఫోగ్రాములు ఎడితే, నువ్వు పుసుక్కుమని బోరు అనీసేవు. బోరైతే సానల్ మార్చాలా, అంతేగాని సిరాకు అడిపోకూడదు." అన్నాడు బాబాయ్.
"సినిమాల గురించే బాబాయ్, నేను చెప్పేది. ఇప్పటికీ ఆరు చానళ్లు మార్చి చూసాను. అన్నింటిలోని చంపుకోవడం, నరుక్కోవడం. చంపడంలో వింత,వింత పద్దతిలు చూపిస్తూ జనాల్ని చెడగొడుతున్నారు. హింస ఇంతలా పెరిగిపోయింది అంటే దానికి 90% కారణం ఈ సినిమాలే... సెన్సార్ బోర్డ్ నిద్రపోతోంది అనుకుంటా. అసలు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకు సామాజిక బాధ్యత లేదు. దానికి తోడు ఈ టీ.వీ.ల్లో ప్రోగ్రాములు అలాగే ఏడ్చాయి." అని తన బాధ మొత్తం వెళ్లగక్కేసాడు అబ్బాయ్.
"అంటే ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలు, రేపులు ఇయ్యన్నీ సినీమాలవల్ల, టీ.వీ.లవల్లేనంటావ్" అన్నాడు బాబాయ్.
"అవును, అదే ముమ్మాటికి నిజం. ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కలిసి సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. మంచి సినిమాలు రావడమే లేదు. ఒక శంకరాభరణం, స్వాతిముత్యం, రుద్రవీణ, సాగర సంగమం, ఆ నలుగురు లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావడం లేదు. అన్నీ హింస పూరితమైన సినిమాలు లేదా వెకిలి చేష్టలతో కామెడీ చేసే సినిమాలు. సమాజం నాశనం అయిపోతోంది అనే ఆలోచన లేకుండా పోయింది ఎవ్వరికీ..." అన్నాడు ఆవేశంగా అబ్బాయ్.
మళ్లీ తనే చెబుతూ "ఇక టీ.వీ.ల్లో అవే కార్యక్రమాలు. డబుల్ మీనింగ్ డైలాగులుతో కామెడీ షోలు, పిచ్చి గెంతులతో డాన్స్ ప్రోగ్రాములు, డబ్బులతో ఆటలు, అన్ని సీరియల్సులో ఒక్కో మగాడికి ఇద్దరో, ముగ్గురో ఆడోళ్లతో లింకు... ఇవే కధలు. అసలు సమాజం ఏమి అవుతుందో అన్న కనీస బాధ్యత లేకుండా పోతోంది." అన్నాడు అబ్బాయ్.
"ఓరి పిచ్చోడా, సినీమాల వల్లో, టీవీల ఫోగ్రాముల వల్లో ఏ ఒక్కడూ బాగుపడ్డమో, పాడైపోవడమో జరగదురా అబ్బాయ్.
అదే గనక జరిగితే ....
-సినీమాలో హీరోలాగ, పతీ తప్పుని నిలదియ్యాల, మనం ఆ సుట్టుపక్కల ఆగమన్నా ఆగం.
-లంచం తీసుకున్నోడిని కనుక్కుని మరీ సంపియ్యాల, కానీ మనమే ఆ సినీమా టిక్కెట్టు బ్లాకులో కొంటాం.
-కులం, మతం అనే మాటలు సెరిపియ్యాల. కానీ అది రోజులో ఒక్క పాలి కూడా తలుసుకోకుండా నిద్దరవ్వం.
-కష్టపడి పనిజేసి అమ్మ,బాబుల్ని పోసించాల. మరి ఓల్డేజీ హోములు ఎన్నున్నాయో నేను సెప్పక్కర్లేదు.
-పెద్దోడి దగ్గర దొంగతనాలు సేసి, పేదోడికి ఎట్టాల. మరి ఈ జనం కనిపించిన ముష్టోడికి ఒక రూపాయి ఇవ్వడానికి అరగంట ఆలోసిస్తారు.
-పోనీ కనీసం ఇలన్ సేసే ఎదవపనులన్నీ సేస్తూ కూకోవాల. కానీ అదీ సెయ్యరు, కూకొని దానిగురించి ఇస్లేసన మాత్రం సేస్తారు.
అంచేత నేను సెప్పొచ్చిదేటంటే సినీమా అనేది కాలక్సేపానికేగానీ, పాఠాలు చెప్పడానిక్కాదు." అన్నాడు బాబాయ్.
"అదేంటి బాబాయ్, అలా మాట్లాడుతున్నావ్? అంటే ఎలాంటి సినిమా తీసిన పర్వాలేదా? ఆ భాష వల్ల తెలుగు మర్చిపోయే స్థాయికి వచ్చేసారు అందరూ... చివరికి సినిమా పేర్లు కూడా ఇంగ్లీషులోనే." అన్నాడు అబ్బాయ్.
"అబ్బాయ్, సినిమా అనేది ఒక యాపారం. జనాలు సూసేది ఆల్లు తీస్తారు, ఆల్లు తీసేది జనాలకి నచ్చితే సూస్తారు. ఒక సినీమా హిట్టైతే, అలాంటియి మరో పది తీస్తారు. ఒక రెడ్డి బాగుందన్నారని, మరో పది రెడ్లొచ్చాయి. టీ.వీ.ల్లో అయినా అదే పిలాసఫీ... ఒక కామెడీ సో నచ్చిందన్నారని, మరో పది తీసేరు. సూసీవోడు లేడనుకో ఆల్లు సేసీది కూడా ఏటుండదు. ఈ మద్య ఒక ముసిలమ్మ, ముసిలాయన్ని ఎట్టి మిధునం అని ఒక సినిమా తీసేరు, ఆహా... అచ్చతెలుగు సినిమా అని కబుర్లు సెప్పే ఎంతమంది టిక్కెట్టు కొనుక్కుని హాల్లో ఆ సినిమా సూసేర్రా? ఆ మద్య లవకుశ మల్లీ తీసేరు, అదెంతమంది సూసేరు? అంచేత సినీమానో, టీవీనో తిట్టుకుని ఉపయోగం లేదురా అబ్బాయ్. ఏం చేసినా, అది జనం... అంటే మనం. సినీమా సూసి ఎవడు రేప్ సెయ్యాలనుకోడు, రేప్ సేద్దాం అనుకున్నోడు సినీమా సూసినా/సూడకపోయినా సేస్తాడు. కాకపోతే అది సినిమా పక్కీలో జరిగిందని ఇదిగో నీలాటి కుర్రకారు కబుర్లాడతారు. ఇలాటియ్యి బాగా ఇంటన్నారని, టీ.వీ.లో బొమ్మ సూపిస్తన్నారు. అప్పుడెప్పుడో అన్నగారు, మందు దొరక్కుండా ప్రొహిబీసన్ ఎట్టేరు. అప్పుడు జనాలు, బీదర్ ఎల్లో, యానాం ఎల్లో, ఒరిస్సా ఎల్లో తాగొచ్చీవోరు. ఆడు తాగుదాం అని డిసైడ్ అయ్యాక, ఎవడు సేసేది ఏటీ ఉండదు. అంచేత నేను సివరాకరుగా సెప్పేది ఏటంటే, ఏ తప్పైనా ఏ ఒక్కడో సెయ్యడు. అందులో నువ్వు, నేను జనాలంతా కలిసే ఉన్నాం. కాకపోతే ఎవడికి ఆడే గులివింద గింజ." అని బాబాయ్ అక్కడ్నించి భోజనానికి వెళ్లిపోయాడు.
============================================
Date: 25.08.2014

No comments:

Post a Comment