స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Saturday 29 June 2013

//కనిపిస్తే//

కష్టాలు మానులకు కాదు, మనుషులకే అని ఎంతోమంది చెబుతున్నా... ఆ కష్టాలని ఓర్చుకునే శక్తి కూడా కొంతవరకే. పదే,పదే పరీక్షిస్తే బండ రాయైనా, బతుకుబండిలాగే మనిషైనా బ్రద్దలవ్వక తప్పదుగా. అలాంటి మనుషులు అయితే వ్యసనాలకి, లేదా సన్యాసానికి... మరీ నీరసపడితే ఆత్మహత్యలకి చేరువవుతారు. మత్తులో ఉన్నవాడు ఆ బాధలకి మొదటగా విమర్శించేది ఆ దేవుడినే, అలాంటి ఒక వ్యక్తి ఆ దేవుడిని ఇలా ప్రశ్నిస్తున్నడు....

పల్లవి:
----------
కనిపిస్తే నిను నిలదీస్తామని,
వినిపిస్తే నిను కదిలిస్తామని,
శిలవైనావా సామీ...
నీ మనసులో ఉన్నది ఏమీ...
నువు బదులే చెప్పరా సామీ...

చరణం:
----------
పాలతోటి తానాలు సేసి, నువు పట్టుబట్టలే కట్టి,
ఆలితోటి ఆ గోపురాన, నువు కాపురాన్నే పెట్టి,
పండగలొసే పల్లకిలోన ఊరేగే ఓ సామీ...(2)
మా ఆకలి కేకలు, ఊరేగింపులో ఇనపడకున్నాయా?
మా చిరిగిన బతుకులు, ఎలగని దివ్వెలు అగుపడకున్నాయా?
నీకు అగుపడకున్నాయా........... //కనిపిస్తే//

చరణం:
---------
దూపమేసి గంధాలు పూసి, నీకు మాలలెన్నో సుట్టి,
లాలిపాటతో ఊయలూపి, నిను నిద్దురలోనే పెట్టి,
దోపిడి సేసి, దచ్చినలిచ్చే దొరలమద్యలో సామీ...(2)
మా తడిసిన కన్నులు, ఇడిసే నీరుకి మురిసే పోయావా?
మా మడుసుల జాడని, గుడిసెల దారిని మరిసే పోయావా?
నువ్వు మరిసే పోయావా..........//కనిపిస్తే//
======================================
29.06.2013

No comments:

Post a Comment